కలం, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలతో అరెస్ట్ అయిన జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ (Prashna Raavan) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే నాలుగు సార్లు బెయిల్ వచ్చినా ఐదో సారి కూడా రావణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరంలో జనసేన నేత ఫిర్యాదు మేరకు రావణ్పై శనివారం రాజద్రోహం కేసు నమోదైంది. దేశసార్వభౌమాధికారానికి భంగం కలిగించాడని, సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టాడని, సమగ్రతకు భంగం కలిగించాడని పేర్కొంటూ ఉపా చట్టం కింద కేసు నమోదైంది.
దీంతో పోలీసులు మరోసారి ఆయనను అరెస్ట్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో రావణ్ పేరుతో ఓ అశ్లీల వీడియో వైరల్గా మారింది. దీంతో రావణ్ భార్య అనూష కెమెరా ముందుకొచ్చి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటుందని ప్రశ్నించారు. తన భర్తపై కేసుల మీద కేసులు వేస్తూ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. గతంలో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారో అదే తన భర్త మాట్లాడాడని అనూష అన్నారు. తన భర్తను కేసులతో ఇబ్బందుల పాలు చేస్తూ, తమను ఇబ్బంది పెట్టే బదులు తన కుటుంబాన్ని చంపేయాలనుకుంటే ఒక్కసారే చంపేయండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన కూతురు తండ్రి కావాలని అడుగుతోందని, తన ముఖం చూసైనా రావణ్ను విడుదల చేయాలని కోరారు. ఎక్కడైనా ఒక కేసు, ఒక స్టేషన్ ఉంటాయని, కానీ ఏపీలో ఒక బెయిల్ వచ్చే కొద్దీ మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. ఇలా కేసులతో ఇబ్బంది పెట్టే బదులు రావణ్తో పాటు తనను, తమ కూతుర్ని చంపేయాలని అనూష పేర్కొన్నారు. తన భర్త మార్ఫింగ్ వీడియోలు చేసి వైరల్ చేస్తున్నారని, ఇది చాలా తప్పు అని అనూష ఆవేదన వ్యక్తం చేశారు.

