కలం, వెబ్ డెస్క్: పండ్లు (Fruits) ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో పెడుతుంటాం. కానీ అన్ని పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టకూడదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని రకాల పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన తొందరగా పాడైపోతాయి, పోషకాలు తగ్గడంతో పాటు రుచిని కూడా కోల్పోతాయని చెబుతున్నారు నిపుణులు. అయితే ఎటువంటి పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫ్రిడ్జ్లో పెట్టకూడని పండ్లు
అరటి పండ్లు (Banana)
అరటి పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన త్వరగా పాడవుతాయట. అరటి పండ్లు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వల్ల సహజంగా మగ్గుతాయి. అయితే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పండ్ల తొక్కలు నల్లగా మారిపోతాయి. అంతే కాకుండా పండుగా గట్టిగా మారుతుంది. రుచి కూడా తగ్గుతుంది.
పుచ్చకాయ (Watermelon)
పుచ్చకాయను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయట. వీటిని కోయక ముందు బయటే ఉంచాలి. అయితే కోసిన పండ్ల ముక్కలను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
బొప్పాయి (Papaya)
ఫ్రిడ్జ్లో పెట్టడం వలన బొప్పాయి పండు గట్టిగా తయారవుతుంది. అంతే కాకుండా రుచి కూడా తగ్గిపోతుంది. త్వరగా పాడైపోతుంది.
మామిడి పండ్లు (Mango)
మామిడి పండ్లు గది ఉష్ణోగ్రత వద్ద సహజంగా మగ్గుతాయి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మగ్గే ప్రక్రియ నెమ్మదించడంతో పాటు తీపిదనం కూడా తగ్గిపోతుందట.
అవకాడో (Avocado)
ఈ పండు పూర్తిగా పక్వానికి రావాలంటే గది ఉష్ణోగ్రత చాలా అవసరం. వీటిని పచ్చిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడం వలన అవి పక్వానికి రాకుండా గట్టిగానే ఉండిపోతాయట.
సపోటా (Sapodilla)
సాధారణంగా మగ్గిన సపోటా పండ్లు జ్యూసీగా ఉంటాయి. కానీ సపోటా పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఎండిపోయినట్లు డ్రైగా మారతాయని చెబుతున్నారు నిపుణులు. వీటితో పాటు జ్యూసీగా ఉండే నేరేడు, రేగు పండ్లను కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం వలన డ్రై గా తయారవుతాయి.
అందుకే ఈ పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టకుండా గది ఉష్ణోగ్రత వద్దనే నిల్వ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.

