కలం, ఖమ్మం బ్యూరో : అంగన్వాడీ టీచర్లు (Anganwadi Teachers), ఆయాలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ (AITUC) అంగన్వాడీల సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి సీతా మహాలక్ష్మి పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని (Manuguru) ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన మణుగూరు ప్రాజెక్ట్ అంగన్వాడీ కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన రూ.18,000 వేతన హామీని వెంటనే అమలు చేయాలని, అప్పటివరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అర్హులైన ఆయాలకు వెంటనే పదోన్నతులు కల్పించాలని, అంగన్వాడీ సిబ్బందిపై (Anganwadi Teachers) మోపుతున్న అదనపు పనిభారాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీఎల్ఓ ఎన్నికల విధుల నుండి 50 ఏళ్లు దాటిన వారిని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని, ఆయాలు లేని కేంద్రాల టీచర్లను మినహాయించాలని కోరారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందే సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అంగన్వాడీ కేంద్రాల సాధారణ కార్యకలాపాలు సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని, ప్రతి కార్యకర్త ఐక్యంగా పోరాటాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
Read Also: మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డిని ఏమనాలి: కేటీఆర్
Follow Us On: Instagram

