కలం, వెబ్ డెస్క్: గుంటూరు (Guntur) జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాడైపోయిన ఆహారం తినడంతో సుమారు 50 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురైన ఘటన చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో చోటుచేసుకుంది. గ్రామంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా పెద్ద సంఖ్యలో భోజనాలు వడ్డించారు. ఆ కార్యక్రమం అనంతరం మిగిలిపోయిన బిర్యానీని గురువారం కొందరు గ్రామస్థులు తినడంతో అస్వస్థతకు గురయ్యారు.
ఒక్కసారిగా విరేచనాలు
బాధితులకు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పరిస్థితి క్రమంగా తీవ్రతరం కావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. మొత్తం 50 మంది వరకు అస్వస్థతకు గురైనట్లు వైద్య వర్గాలు తెలిపాయి. వీరిలో 44 మంది ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్నారని సమాచారం. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ఆరుగురిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
స్పందించిన జిల్లా వైద్యఆరోగ్యశాఖ
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్వో) విజయలక్ష్మి కొత్తరెడ్డిపాలెం గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక వైద్య సిబ్బందికి సూచనలు చేశారు.

