కలం, వెబ్ డెస్క్ : ఏపీలో కూటమి పాలనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) మరోసారి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం నడిపిస్తున్నారని ఆరోపించారు.
దుష్ట సంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి అని చంద్రబాబుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు మిస్సింగ్ అయినా, మహిళలపై నేరాలు పెరుగుతున్నా అరెస్టులు చేయడం లేదన్నారు. కానీ, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు చేసి చిత్రహింసలు పెడుతారా అని జగన్ ప్రశ్నించారు.
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన (YS Jagan) ఆరోపించారు. రాష్ట్రాన్ని కుదిపేసిన సాయికృష్ణ లాకప్డెత్ కేసులో మృతుడి తల్లి అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానా రాలేవన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. విమర్శకులను నేరస్థులుగా చిత్రీకరించి దాడి చేయించడం ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడమేనని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి రౌడీ పోలీస్ రాజ్యం, జంగిల్ రాజ్ అవసరం లేదన్నారు. ప్రజలకు భద్రత కల్పించే పాలన.. రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలని జగన్ స్పష్టం చేశారు.

