కలం, కరీంనగర్ బ్యూరో: కార్పొరేటర్ల ఫోన్ల కొనుగోళ్ల కోసం టెండర్లు (Corporates Cell Phone Tender) నిర్వహించడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, వెంటనే టెండర్లను రద్దు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సీపీఐ కరీంనగర్ (Karimnagar CPI) నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో అధికారులు ప్రజల నుంచి పన్ను పేరున, నల్ల బిల్లు పేరున, చివరికి చెత్త తీసుకపోవడానికి కూడా వందలాది రూపాయలు దోచుకెళ్తున్నారన్నారు. ఇక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యుల సెల్ ఫోన్ల కొనుగోళ్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడం సిగ్గుచేటు అన్నారు.
నగరంలో వీధిదీపాలు, డ్రైనేజీలు వర్షం వస్తే నీటి నిలువ ఉండకుండా చర్యలు తీసుకోలేని చేతగాని దుస్థితిలో ఉన్న మున్సిపల్ అధికారులకు లక్షల రూపాయలు పెట్టి కార్పొరేటర్లకు ఫోన్లు కొనడానికి మాత్రం ఏ విధంగా డబ్బులు వస్తున్నాయని ప్రశ్నించారు. వెంటనే మున్సిపల్ అధికారులు ప్రజాధనం వృథా చేయకుండా కార్పొరేటర్ల సెల్ ఫోన్ల కోసం కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టెండర్లను రద్దు చేయకుంటే మున్సిపల్ ఆఫీసును ముట్టడించి ఈ అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు.

