కలం, వెబ్ డెస్క్ : ఏపీలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. తాడేపల్లిలోని నివాసంలో మంగళవారం సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతి, రాజు నాయక్లు వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan)ను కలిశారు. ఈ సందర్భంగా తమ కుమార్తె హత్యాచారం జరిగి తొమ్మిదేళ్లు గడుస్తున్నా తమకు ఇంకా న్యాయం జరగలేదని, తమకు న్యాయ సహాయం అందించాలని వైఎస్ జగన్ ను సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కోరారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ కుటుంబానికి కర్నూలు నగరంలో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడంతో పాటు ప్రీతి తండ్రి రాజు నాయక్కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అండగా నిలిచారని .. కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ జీవో జారీ చేశారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత కేసును పూర్తిగా పక్కన పెట్టేశారని.. ప్రస్తుతం సీబీఐ విచారణ కూడా నిలిచిపోయిందని తెలిపారు. అంతేకాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే నెపంతో గతంలో తమకు ఇస్తున్న పెన్షన్ను కూడా నిలిపివేశారని వాపోయారు.
ఈ క్రమంలోనే విచారణను పునరుద్ధరించేలా తమకు అవసరమైన లీగల్ సపోర్ట్ అందించాలని వారు వైఎస్ జగన్ను కోరారు. దీంతో వారి కుటుంబానికి పార్టీ పరంగా అన్ని రకాల న్యాయ సహాయం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడే వరకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

