కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇరాన్ దేశానికి చివరి వార్నింగ్ ఇచ్చారు. వెంటనే శుద్ధి చేసిన యురేనియాన్ని తమకు అప్పగించాలని అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే, యుద్ధాన్ని మళ్లీ మొదలుపెడుతామని.. ఈసారి దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన ఒక ప్రదేశంలో దీన్ని అప్పగించవచ్చని సూచించారు. IAEA అంచనా ప్రకారం, ఇరాన్ వద్ద 60 శాతం మేర 440 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉంది. అణ్వాయుధ తయారీకి ఇది సరిపోతుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఆందోళన చెందుతోంది.
యురేనియం అప్పగించేందుకు ఇరాన్ అంగీకారం..?
తమ వద్ద ఉన్న యురేనియాన్ని అమెరికాకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు సుప్రీం నేత సహా ఎవరూ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం, ఇరాన్–అమెరికా దేశాల మధ్య చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇరాన్ తన యురేనియాన్ని అమెరికాకు అప్పగించడమా..? అది సూచించిన మరో దేశం వద్ద నిల్వ ఉంచడమా..? అనే లక్ష్యంగా చర్చలు జరుగుతున్నాయి.

