కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా నార్సింగ్ మండలం వల్లూరు (Valluru) వద్ద నాగ్ పూర్ జాతీయ రహదారి NH 44 పై వల్లూరు గ్రామస్తుల ధర్నా నిర్వహించారు. నిత్యం వేలాది వాహనాలు నడిచే హైవే పై వల్లూరు గ్రామ యూటర్న్ వద్ద తరచు రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. వెంటనే వల్లూరు వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించాలని హైవేపై గ్రామస్తుల, మహిళలు బైఠాయించారు.
దీంతో NH 44 హైవేపై రోడ్డుకు ఇరు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అండర్ బిడ్జ్ లేకపోవడంతో ఇప్పటికే చాల మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ, ప్రజా ప్రతినిధులు, హైవే అధికారులు అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణంపై హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారీ ట్రాఫిక్ జామ్ తో రంగంలోకి దిగిన పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు వల్లూరు గ్రామస్తులు.

