కలం, వెబ్ డెస్క్: ఆన్లైన్ లోన్ యాప్లు, బెట్టింగ్ యాప్ల మోసాల (Betting App Fraud) గురించి పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా యువత తీరు మారడం లేదు. తరచూ ఆన్లైన్ కేటుగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. తాజాగా మహబూబాబాద్ (Mahabubabad)లో మరో యువకుడు ఆన్ బెట్టింగ్కు బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లాలోని గొల్లచర్ల గ్రామానికి చెందిన మంద సాయికుమార్ కొన్ని నెలలుగా ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో యాప్స్లో రూ.95 వేల వరకు నష్టపోయాడు. ఇక తన దగ్గర డబ్బులు పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు సాయికుమార్ను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయికుమార్ మృతి చెందాడు. సాయికుమార్ తండ్రి శ్రీను ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


