కలం, ఖమ్మం బ్యూరో : కొత్తగూడెం మున్సిపాలిటీ (Kothagudem Municipality) నుంచి గెలిచిన స్వతంత్ర కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఆదివారం వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పొంగులేటి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో 1వ వార్డు కార్పొరేటర్ సీరపు సుగుణ, 13వ వార్డు కార్పొరేటర్ తలుగు శాంత, 34వ వార్డు కార్పొరేటర్ బట్టు విజయలక్ష్మి, 42వ వార్డు కార్పొరేటర్ దున్నపోతుల మణి, 48వ వార్డు కార్పొరేటర్ ధర్మసోత్ నరేశ్ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


