కలం, మెదక్ బ్యూరో: కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన తర్వాత వచ్చే మొదటి జీతంతో నచ్చిన ఫోనో.. బైకో కొనుక్కుంటాం. లేదేంటే తల్లిదండ్రులకు ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇస్తాం. కానీ సిద్దిపేట (Siddipet) జిల్లాకు చెందిన యువతి మానస్వి మాత్రం తన మొదటి వేతనాన్ని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అందజేసి మానవత్వం చాటుకుంది.
తండ్రి బాటలో కూతురు
గజ్వేల్ మున్సిపాలిటీ (Gajwel Municipality) పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన పులి రాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గత 26 సంవత్సరాలుగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలపై అధ్యయనం చేస్తూ ఆ కుటుంబాలకు దాతల సహకారంతో ఆర్థిక సాయం చేస్తున్నాడు. పులి రాజు ప్రతి ఆదివారం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను కలుస్తూ వివరాలు సేకరించి, వారికి సాయం అందిస్తున్నాడు. తండ్రి సామాజిక సేవను చిన్నప్పటి నుండి గమనిస్తూ పెరిగింది మానస్వి. ఇటీవల ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ అమ్మాయి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించింది. మొదటి వేతనం పొందిన మానస్వి తనకు వచ్చిన డబ్బులు మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఐదు రైతు కుటుంబాలకు అందజేసింది. ఒక్కొక్కరికి ఐదువేల నగదుతోపాటు చీరలను అందించింది.
సామాజిక కార్యక్రమాల్లో..
25 సంవత్సరాలుగా రైతు ఆత్మహత్యలపై పనిచేస్తున్న మానస్వి సైతం తండ్రి చేసే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలో రైతుల కష్టాలను, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను గురించి తెలుసుకుంది. అందుకే తన జీతం అందించింది. చిన్నతనంలోనే పెద్ద మనసు చూపించిన మానస్విని పలువురు అభినందించారు.
Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!
Follow Us On : WhatsApp

