కలం, వెబ్ డెస్క్ : యుమునా నది (Yamuna River) మళ్లీ తీవ్ర కాలుష్యానికి గురైంది. ఢిల్లీలోని కాళింది కుంజ్ వద్ద నదిపై దట్టమైన తెల్లటి నురగ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఉదయం ఆ ప్రాంతంలో విషపు నురగ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో బ్రిడ్జ్ సమీపంతో పాటు నది ఒడ్డున నురగ పేరుకుపోయింది. గతంలోనూ యమునా నది (Yamuna River) లో ఇలాంటి దృశ్యాలు కనిపించిన విషయం తెలింది. తాజాగా మరోసారి విషపు నురగ కనిపించడం పట్ల పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నురగ పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు, ఫాస్పెట్లు అధికంగా ఉండే డిటర్జెంట్లు వినియోగించడం వల్ల ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
దీంతో పాటు నదిలో అనేక రకాల రసాయన మూలకాలు, పారిశ్రామిక వ్యర్థాలు కూడా కలపడం వల్ల యమునమ్మ విషపు నురగలు కక్కుతోంది. ముఖ్యంగా పండుగల సమయంతో పాటు సాధారణ సమయాల్లో నదిలో కాలుష్యం ఏర్పడడం ఢిల్లీ ప్రభుత్వానికి సవాల్ గా మారింది. నదిలో కాలుష్యం ఏర్పడడం వల్ల స్థానికులకు శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. యమునా నది ఢిల్లీలోకి ప్రవేశించిన తరువాత అధిక కాలుష్యానికి గురవుతోందని తెలుస్తోంది. పారిశ్రామిక వ్యర్థాలతో పాటు, సీవేజ్ వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా, ప్రభుత్వం పెడచెవిన పెట్టడాన్ని వాళ్లు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా యుమునా నదిని కాలుష్య కోరల నుంచి కాపాడాలని పర్యావరణ కార్యకర్తలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

