కలం, ఖమ్మం బ్యూరో: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా వ్యాప్తంగా న్యాయస్థానాల ప్రాంగణాల్లో హరితోత్సవాలు ఘనంగా జరిగాయి. ఖమ్మం కోర్టులో న్యాయమూర్తులు జామ, మామిడి, ఉసిరి, మర్రి, రావి, కానుగ తదితర మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలుష్యం కోరలు చాస్తున్న నేటి కాలంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత అవసరమని పేర్కొన్నారు. ‘మొక్కలు నాటుదాం – భవిష్యత్ను కాపాడుదాం’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. నాటిన మొక్క వృక్షంగా ఎదిగే వరకు సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఆకాంక్షించారు. కోర్టులు న్యాయంతో పాటు పచ్చదనానికి కూడా నెలవు కావాలని కోరారు. ఖమ్మం బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, సీనియర్ మహిళా న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భద్రాచలంలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో పర్యావరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కోర్టు మేజిస్ట్రేట్ శివనాయక్, అడిషనల్ మేజిస్ట్రేట్ దుర్గా భవానీ కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. భావి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి మొక్కలు నాటడం ఎంతో అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

