కలం, మెదక్ బ్యూరో : భారీ వర్షాలకు తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి (Padma Devender Reddy) డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె శుక్రవారం సందర్శించారు. అనంతరం మండల నాయకులు, రైతులతో కలిసి మెదక్ సిద్దిపేట హైవే పైన మొలకెత్తిన ధాన్యం పోసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. శుక్రవారం కురిసిన భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రైతులకు ఇంతటి కష్టాలు వచ్చినా స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కనిపించడం లేదని ఆమె మండిపడ్డారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు కూడా ఎమ్మెల్యే ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్మిల్లులకు తరలించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

