కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో సగం స్థానాలు మహిళలకు రిజర్వ్ కావడంతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలు బరిలో ఉన్నారు. ఇవన్నీ కలిపి కలిపి సగానికి పైగా స్థానాలలో మహిళలు పోటీ చేస్తున్నారు. దీంతో ఈసారి పట్టణ స్థానిక సంస్థలలో అధికారం చెలాయించబోయేది మగువే అని స్పష్టం అవుతోంది. మరో పక్క ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలలో కూడా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి ఎన్నుకునే వారితో పాటు, ఎన్నికయ్యే వారిలో కూడా మహిళలే అధికంగా ఉన్నారని తెలుస్తోంది.
ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉండగా మహిళలకు 30 డివిజన్లు కేటాయించారు. దీంతో పాటు మహిళా ఓటర్లు కూడా పురుషులకంటే దాదాపు 6 వేల మంది అధికంగా ఉన్నారు. అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్న కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా మహిళలు 13 వార్డుల్లో పోటీ చేస్తున్నారు. సత్తుపల్లిలోని 20 వార్డుల్లో 15 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. మధిరలో 22 వార్డులు ఉంటే 14 వార్డుల్లో మహిళలు బరిలో ఉన్నారు. ఈ మున్సిపాలిటీలన్నింటీలోనూ పురుష ఓటర్లకంటే మహిళలే అధికంగా ఉండటం గమనార్హం.
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలో రెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇల్లందు మున్సిపాలిటీలో 24 వార్డులుండగా మహిళలకు 12 వార్డులను కేటాయించారు. అశ్వారావుపేట లో 22 వార్డులు ఉండగా 11 మహిళలకే కేటాయించారు. ఇక్కడ కూడా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్న ఐదు మున్సిపాలిటీలలో కల్లూరు మినహా మిగిలిన చైర్ పర్సన్ లు మహిళలకే దక్కాయి. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మేయర్ పదవి ఎస్టీ జనరల్ కు దక్కగా మిగిలిన రెండు మున్సిపాలిటీలు కూడా మహిళలకే దక్కాయి. అంటే పట్టణ పురపాలిక ఎన్నికల్లో, ఎన్నికల అనంతరం పాలనలో కూడా మగువే కీలకం కానున్నదని స్పష్టం అవుతోంది.
Read Also: 17వ అంతస్థు నుంచి దూకి ముల్తానీ బేకరీ ఓనర్ సూసైడ్
Follow Us On : WhatsApp


