కలం, వెబ్ డెస్క్: నిజామాబాద్ కార్పొరేషన్ (Nizamabad Corporation) పరిధిలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) దీమా వ్యక్తం చేశారు. సర్వేలు మొత్తం కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. నిజామాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత మహిళా అభ్యర్థులదేనని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ పరిధిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. సగం స్థానాలు ఇక్కడ మహిళలకే కేటాయించామని చెప్పారు. ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కాబోతున్నారని చెప్పారు. ఒక్క ఓటు కూడా కీలకమేనని .. అందుకే పార్టీ కార్యకర్తలు ఎంతో శ్రమించాలని కోరారు. ప్రతి ఓటును కీలకంగా తీసుకొని ప్రచారం నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం ఉందన్నారు.
కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్రమైన పోటీ
కాంగ్రెస్ పార్టీ బీ ఫారం వస్తే గెలుస్తామని నమ్మకం అభ్యర్థుల్లో ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నదని చెప్పారు. టికెట్ వచ్చిన వాళ్లు అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. టికెట్ వచ్చిందని నిర్లక్ష్యం చేయద్దని ఒక్కో ఓటు కోసం గట్టిగా పనిచేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లో కి తీసుకెళ్లే దాన్ని బట్టే విజయావకాశాలు ఉంటాయని చెప్పారు. అందరినీ కలుపుకొని పోతే సగం గెలుపు మనదేనన్నారు. మళ్లీ మళ్లీ పోటీ చేసే అవకాశం అందరికీ రాదని సూచించారు.
కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ (Revanth Reddy) కోరారు. పార్టీ టికెట్ ఇచ్చినపుడు ఎట్టి పరిస్థితుల్లో గెలిచి చూపించాలని కోరారు. పార్టీ నుంచి అభ్యర్థులకు అన్ని విధాల సహకారం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలని కోరారు. ప్రతిపక్షాలు విద్వేషాలను రెచ్చగొడతాయని.. వాళ్ల ట్రాప్ లో పడొద్దని సూచించారు. తానే మునిసిపల్ మంత్రినని.. నిజామాబాద్కు ఎన్ని నిధులు కావాల్సి వచ్చినా తీసుకొస్తానని చెప్పారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని కోరారు.
Read Also: అండర్ 19 ఫైనల్: భారత్ భారీ స్కోరు
Follow Us On: Sharechat


