కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ఇంట్లోనే రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది. పాలకుర్తి మండలం, పుట్నూరు గ్రామానికి చెందిన బోతు సుమలత (28) మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురైంది. బుధవారం ఉదయం జనాభా లెక్కల సమాచారం సేకరించడం కోసం ఒక అధికారి సుమలత ఇంటికి వెళ్లారు. అక్కడ మంచంపై సుమలత రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి సదరు అధికారి భయంతో కేకలు వేశారు.
అధికారి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బసంతనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఎస్ఐ నూతి శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

