కలం, మునుగోడు (నాంపల్లి): అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (MLC Nellikanti) అన్నారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యహరించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, సర్పంచులు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలన్నారు.
అనంతరం నాంపల్లి ఎంపీడీవో పీవీఎస్ రామకృష్ణ శర్మ మాట్లాడారు. మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే సర్వసభ్య సమావేశాలకు మండల స్థాయి అధికారులు క్రమం తప్పకుండా హాజరుకావాలని కోరారు. సమావేశలకు గైర్హాజరయ్యే అధికారుల వివరాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాలు సకాలంలో చెల్లించాలని సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
ఈ సమావేశంలో పలువురు సర్పంచులు తమ గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకన్న, పీఎసీఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.

