కలం, నల్లగొండ : రైతులు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కాంటాలు వేయడంలో జాప్యం చేయకుండా సకాలంలో ప్రక్రియ పూర్తి చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని షాపల్లి, నెమ్మాని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను చిరుమర్తి లింగయ్య బుధవారం సందర్శించారు.
కేంద్రాల్లో ధాన్యం రాశులను పరిశీలించి, ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో ముఖాముఖి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోజులు తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల దృష్ట్యా వర్షాలు పడే అవకాశం ఉందని, ధాన్యం తడవకుండా అధికారులు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా, పారదర్శక పద్ధతిలో ధాన్యం కొనుగోళ్లు జరపాలని అధికారులను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ధాన్యం కొనుగోళ్లలో తలెత్తుతున్న సాంకేతిక, రవాణా పరమైన సమస్యలను పరిష్కరించి అన్నదాతను ఆదుకోవాలన్నారు.

