కలం, వెబ్ డెస్క్: జగిత్యాల (Jagtial) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోతుల కొట్లాట (Monkey Fight)కు ఓ నిండు ప్రాణం బలైపోయింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో (Dharmapuri) కోతుల బెడద ఎక్కువగా ఉంది. తరచూ కోతులు ఇండ్లల్లోకి వచ్చి జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కొద్ది రోజులుగా స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఓ కోతుల గుంపు తిరుగుతోంది. కొనపర్తి పద్మ అనే మహిళ తన ఇంటి వద్ద పనులు చేసుకుంటుండగా ఇంటిపైకి కోతుల గుంపు చేరింది. కోతులు రావడం సర్వసాధారణం కావడంతో పద్మ వాటిని పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమై పోయింది. కారణం ఏంటో తెలియదు కానీ.. ఒక్క సారిగా కోతుల గుంపు పద్మ ఇంటిపై పోట్లాడుకోవడం మొదలైంది.
కోతుల గొడవతో ఇంటిపై రేకులు గాలికి ఎగిరిపోకుండా బరువు కోసం పెట్టిన సిమెంట్ ఇటుక కింద పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న పద్మ తలపై ఆ ఇటుక పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ధర్మపురి (Dharmapuri) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కోతుల గొడవకు మహిళ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అధికారులు స్పందించి ఇప్పటికైనా కోతులతో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also: ఎమ్మెల్యేల పనితీరుపై కాంగ్రెస్ సీక్రెట్ సర్వే..!
Follow Us On: Sharechat

