కలం, రఘునాథపల్లి : జనగామ (Jangaon) జిల్లాలో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. వరుస ప్రమాదాలతో ఈ ప్రాంతం రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. తాజాగా గురువారం తెల్లవారుజామున జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామ సమీపంలో వేగంగా వచ్చిన ఒక లారీ ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇటీవలి కాలంలో జనగామ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితమే లింగాల ఘనపురం మండలం నవాబుపేట గ్రామ సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకం మరువకముందే, రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా వద్ద ఒక కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇప్పుడు నెల్లుట్ల వద్ద జరిగిన తాజా ప్రమాదంతో జిల్లాలో వరుస మరణాల పరంపర కొనసాగుతోంది. ఈ తాజా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, బాధితుల గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

