కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి (CM Suvendu Adhikari) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన నందిగ్రామ్, భవానీపూర్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి, రెండు చోట్ల గెలిచారు. రాజ్యాంగం ప్రకారం, ఒకటే స్థానానికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉండటంతో.. నందిగ్రామ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి భవానీపూర్ నుంచి శాసన సభ్యుడిగా కొనసాగనున్నారు. ఇక్కడ టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీపై భారీ విజయం సాధించారు. దీంతో, ఇదే స్థానం నుంచి కొనసాగాలని నిర్ణయించుకున్నారు.
చకచకా నిర్ణయాలు..
సువేందు అధికారి సీఎం అయిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే, బంగ్లా సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి అవసరమైన భూమిని బీఎస్ఎఫ్కు అప్పగించారు. మమతా బెనర్జీ హయాంలో నియమితులైన అధికారులను పూర్తిగా మార్చేసి, వారిని మరో చోటకు పంపించారు. అత్యంత కీలకమైన విభాగాల్లో ఉన్నతాధికారులను బదిలీ చేశారు. అలాగే, గత ప్రభుత్వంలో నియమితులైన వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, నామినేట్ సభ్యులను పూర్తిగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

