కలం, వెబ్ డెస్క్ : ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాలి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఫెర్రీ (Bali ferry)లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, సుమారు 25 మంది మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఇప్పటివరకు 106 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫెర్రీలో మొత్తం 131 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరితో పాటు 44 వాహనాలు, 53 మోటారు సైకిళ్లు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.
సముద్రంలో ఎగసిపడుతున్న భారీ అలల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేసేందుకు అధికారులు హెలికాప్టర్ను కూడా రంగంలోకి దించారు. ఈ ఫెర్రీ పడాంగ్ బాయి పోర్టు నుంచి లెంబార్ పోర్టుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

