కలం, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) తనపై నమోదైన పోక్సో కేసులో విచారణకు హాజరు కావడం లేదని సమాచారం. మధ్యాహ్నం రెండు గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు రావాలని కరీంనగర్ పట్టణంలోని భగీరథ్ మామయ్య ఇంట్లో నిన్న నోటీసులు అందించారు. కాగా, తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో భగీరథ్ పిటిషన్ దాఖలు చేశాడు. రేపు దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కాలేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాధితురాలి వద్దకు వెళ్లిన డీసీపీ..
ఈ కేసులో ఏర్పాటైన సిట్ అధికారిణి డీసీపీ రితి రాజ్.. నిన్న బాధితురాలి ఇంటికి ఒంటరిగా వెళ్లినట్లు సమాచారం. ఆమెతో రెండు గంటల పాటు ఏకాంతంగా మాట్లాడి.. పూర్తి వివరాలు తెలుసుకున్నారు. రెండోసారి ఆమెతో స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం, మరిన్ని కఠినమైన సెక్షన్లు జోడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు హైకోర్టులో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

