కలం, వెబ్ డెస్క్ : శాసనసభ, మండలి సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) పార్టీ నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై గతంలోలాగే ఇప్పుడు కూడా మరింత గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా శాసనమండలి సభ్యులంతా సమావేశాలకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
శాసనసభలో వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేందుకు ప్రస్తుత ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని ఆయన విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయంతో పాటు, ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే సమయం హక్కుగా లభిస్తుందని పేర్కొన్నారు. ఆ హక్కు దక్కడం చంద్రబాబుకు ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ వేదికగా ఏమీ చేసే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు.
అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించే ప్రతీ అంశంపై ఆధారాలు, సాక్ష్యాలతో తాను స్వయంగా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ (YS Jagan) స్పష్టం చేశారు. ప్రతి అంశంలోనూ నాణేనికి రెండోవైపు ఉన్న నిజాలను ప్రజల ముందుకు తీసుకువస్తామన్నారు. అదే సమయంలో శాసనమండలిలో తమకు తగిన బలం ఉన్నందున, ప్రజా సమస్యలపై అక్కడ గట్టిగా గళం విప్పాలని పార్టీ ప్రతినిధులను ఆదేశించారు.

