కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal), హైదరాబాద్ నగరాల్లో బైక్ లను ఎత్తుకెళ్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను (Bike Theft Gang) గురువారం సంగెం, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసారు. పట్టుబడిన వారిలో నలుగురు మైనర్లు ఉన్నారు. ఈ ముఠా నుండి పోలీసులు సుమారు రూ.15 లక్షల విలువ గల 15 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ కు చెందిన దరాంగుల అంజీ, ఉర్సు సంతోష్, కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన జైదా రామకృష్ణ, నలుగురు మైనర్ లతో ముఠాగా ఏర్పడి బైక్ దొంగతనాలకుపాల్పడుతున్నారు. వరంగల్, హైదారబాద్ నగరంలో తాళం వేసి వున్న బైక్ లను చోరీ చేసి హనుమకొండ పద్మాక్షమ్మ గుట్ట ప్రాంతంలో రహస్యంగా భద్ర పర్చేవారు. ఈ తరహలో నిందితులు మొత్తం 15 చోరీలకు పాల్పడగా ఇందులో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు, సంగెం, హసన్పర్తి, మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు చొప్పున ఆరు బైక్ లు చోరీ చేశారు.
హనుమకొండ, ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున, హైదరాబాద్ మడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైక్ లను నిందితులు చోరీ చేసారు. ఈ నెల ఒకటిన సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశాలపల్లి గ్రామంలో ఒక బైక్ ను నిందితులు చోరీ చేసారు. యజమాని సంగెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు బృందాలుగా ఏర్పడ్డారు. గురువారం ఉదయం గవిచర్ల గ్రామంలోని గుండు సమ్మయ్య ఆలయం వద్ద ఎస్.ఐ వంశీ కృష్ణ అధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. ఆరుగురు నిందితులు (Bike Theft Gang) చోరీ చేసిన రెండు వాహనాలపై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో పద్మాక్షమ్మ గుట్ట ప్రాంతంలో భద్రపర్చిన మిగతా బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ అంకిత్ కుమార్ వెల్లడించారు.
Read Also: వాట్సాప్ను బ్లాక్ చేసిన రష్యా
Follow Us On: Sharechat


