కలం, వరంగల్ బ్యూరో: చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతూ సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరించే రౌడీ షీటర్ల పట్ల అణిచివేత ధోరణితో వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ (CP Sunpreet Singh) అధికారులను ఆదేశించారు. హసన్పర్తిలోని కిట్స్ కళాశాలలో శుక్రవారం నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించే రౌడీ షీటర్ల కౌన్సిలింగ్లో వంద శాతం రౌడీ షీటర్లంతా హాజరు కావాలన్నారు. ప్రతి నెల ఒకమారు స్టేషన్ అధికారులు వ్యక్తిగతంగా రౌడీ షీటర్ల ఇండ్లను సందర్శించి వారిని తనిఖీ చేయాలన్నారు. ఇదే సందర్బంగా వారి స్థితిగతులపై కుడా ఆరా తీయాలని, తనిఖీ సమయాల్లో లేని రౌడీ షీటర్ల కదలికలపై వివరాలు సేకరించాలని సూచించారు. నేరాల నియంత్రణలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి సమయాల్లో బెల్ట్ షాపులను మూయించాలన్నారు. అలా చేయకుంటే వారిపై కేసులు నమోదు చేయడం లేదా బైండోవర్ చేయాలని, ముఖ్యంగా నిర్ణీత సమయాల్లో షాపులను మూయించాల్సిన బాధ్యత సంబంధిత స్టేషన్ అధికారిపై ఉందన్నారు.
రాత్రి సమయాల్లో అధికంగా రద్దీ ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ఇకపై రాత్రి సమయాల్లో ఎవరైనా రోడ్లపై జన్మదిన వేడుకలు జరుపుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. చోరీల కట్టడికి ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇండ్లతో పాటు ఇతర వ్యాపార సంస్థల్లో పనులు చేసే వారి వివరాలతో పాటు హస్టల్స్ నిర్వహణకు సంబందించిన వివరాలు సైతం స్థానిక పోలీసులు సేకరించాలన్నారు. అధికారుల పనతీరుపై పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేస్తూ ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి తప్పని సరిగా ఉదయం 9 గంటల నుండి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. నేరస్థుల అరెస్టు విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ద్విచక్ర వాహనాలు చోరీ అయితే వెంటనే దానిపై కేసు నమోదు చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పెట్రోలింగ్ వాహనాల పనితీరును అధికారులు సమీక్ష జరపాలని, మీ ఉద్యోగానికి మీరు న్యాయం చేస్తే ప్రజలకు న్యాయం చేసినట్లని సీపీ తెలిపారు. అనంతరం పెండింగ్ కేసులు, నేరస్తుల అరెస్టు, కేసుల్లో కొనసాగుతున్న దర్యాప్తు తీరుతెన్నులు, నేర నియంత్రణకై స్టేషన్ పరిధిలో తీసుకుంటున్న చర్యలతో పాటు, ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకుగా అధికారులు చేట్టిన చర్యలపై పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులను అడిగితెలుసుకున్నారు. ఈ సమావేశంలో డీసీపీలు అకింత్ కుమార్, దార కవిత, రాజమహేంద్ర నాయక్, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, బాల స్వామి, సురేష్ కుమార్తో పాటు ఏసీపీలు, ఇన్స్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు.

