కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి (Wanaparthy) జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులు రానున్న మూడు నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం నీటి పారుదల ప్రాజెక్టుల భూసేకరణ అంశం ప్రథమ ప్రాధాన్యతగా పనిచేయాలని సూచించారు. బుద్ధారం పెద్ద సముద్రం ప్రాజెక్టుకు సంబంధించి 101 ఎకరాలు, గణప సముద్రం ప్రాజెక్టుకు సంబంధించి 164 ఎకరాలు, తూముకుంట, సంగినేనిపల్లి కాల్వలకు 94 ఎకరాల భూ సేకరణ వేగంగా చేపట్టాలన్నారు. ఎంతమంది రైతులు, వారిలో పట్టా రైతులు ఎంతమంది అనే వివరాలతో డేటా తయారు చేయాలన్నారు. జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేసి, తేదీల వారీగా రైతులతో సమావేశం ఏర్పాటు చేసి నష్టపరిహారం గురించి చర్చించాలన్నారు. జులై మొదటి వారంలోగా ఆయా భూములకు సంబంధించి అవార్డులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

