కలం, మెదక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ (Telangana) ఉద్యమకారులను గుర్తించడానికి కే.కేశవరావు ఆధ్వర్యంలో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెదక్ (Medak) జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం కోసం బుధవారం సాయంత్రం 5 గంటలకు మెదక్ టీఎన్జీవో భవన్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో మెదక్ జిల్లా పాత్ర అత్యంత కీలకమైనదని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొని తెలంగాణ సాధించుకున్నారని మెదక్ జిల్లా ఉద్యమ జేఏసీ సమన్వయ కమిటీ నాయకులు పేర్కొన్నారు.
మెదక్ జిల్లాలో జరిగిన అన్ని కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొన్న వారందరిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కమిటీ పిలుపునిచ్చింది. రేపు జరిగే సమావేశంలో మెదక్ మండలం, పట్టణం హవేలీ గణపురం, పాపన్నపేట, కొల్చారం, వెల్దుర్తి మండలాల్లో పని చేసిన ఉద్యమకారులందరూ ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా నాయకులు కోరారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు బి.కొండల్ రెడ్డి, సడిమెల యాదగిరి, కంది శ్రీనివాస్ రెడ్డి, శంకర్ దయాల్ చారి, బొందుగుల నాగరాజు, పీడీ ఆనందం, భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

