కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా కొనసాగించాలని, అదేవిధంగా గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ (Wanaparthy Additional Collector) ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరి కొనుగోళ్ల ప్రక్రియపై సంబంధిత అధికారులతో వినోద్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా కొనసాగించాలని, అదేవిధంగా గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైనన్ని లారీలను అందుబాటులో ఉంచి, రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత అవసరాల మేరకు నిర్దేశించిన కొనుగోలు కేంద్రాలకు అదనపు లారీలను పంపాలని ఆదేశించారు. మిల్లుల వద్ద అన్లోడింగ్ కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలనీ, పోలీస్ అధికారుల సమన్వయంతో అన్ లోడింగ్ చేయించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్దేశిత లక్ష్యం ప్రకారం వరి ధాన్యం కొనుగోళ్లు జరగాలని ఆదేశించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని వేగంగా తూకం వేసి కేటాయించిన మిల్లులకు తరలించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, జిల్లా మేనేజర్ ఆంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

