కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ డైరెక్షన్లో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన బ్లాక్బస్టర్ సినిమా ధురంధర్ (Dhurandhar) విడుదలై రోజులు గడుస్తున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రెటీల వరకు, నార్త్ నుంచి సౌత్ వరకు అందరూ ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. తాజాగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma) దంపతులు ధురంధర్ 2 పై ప్రశంసల వర్షం కురిపించారు. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ, ఈ సినిమా అత్యంత ఉత్కంఠభరితంగా, అద్భుతమైన నిర్మాణ విలువలతో సాగిందని కొనియాడారు. ఈ మేరకు తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్, నటీనటులను పొగడ్తలతో ముంచెత్తుతూ పోస్ట్లు షేర్ చేశారు.
విరాట్ కోహ్లీ ఈ చిత్రాన్ని ‘జీనియస్ వర్క్’ గా పేర్కొన్నారు. భారత్లో ఇలాంటి సినిమాటిక్ అనుభవాన్ని తానెప్పుడూ చూడలేదని, నాలుగు గంటల పాటు కనురెప్ప వేయకుండా సినిమాను ఆస్వాదించానని రాసుకొచ్చారు. రణవీర్ సింగ్ నటనను ‘బియాండ్ బ్రిలియంట్’ అని కొనియాడారు. విరాట్ ప్రశంసలపై ఆదిత్య ధర్ స్పందిస్తూ.. అండర్ 19 రోజుల నుండి తాను విరాట్కు అభిమానినని, ఒక లెజెండ్ నుండి ఇలాంటి అభినందనలు రావడం తనకెంతో గర్వంగా ఉందని, దేశం గర్వపడేలా సినిమాలు తీస్తానని హర్షం వ్యక్తం చేశారు.
అనుష్క శర్మ స్పందిస్తూ ఆదిత్య ధర్ను ఒక ‘ఫియర్స్ ఒరిజినల్’ దర్శకుడిగా అభివర్ణించారు. రణవీర్ సింగ్కు ఇది జీవితకాలంలో ఒకసారి మాత్రమే వచ్చే పాత్ర అని, అతను అద్భుతంగా యాక్టింగ్ చేశాడని ప్రశంసించారు. అలాగే మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి ఇతర నటీనటులను కూడా ఆమె మెచ్చుకున్నారు. దీనికి దర్శకుడు ఆదిత్య స్పందిస్తూ.. అనుష్క వంటి గొప్ప నటి నుంచి ఇటువంటి ప్రశంసలు రావడం సంతోషమని కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కథలను అందించేందుకు ఇది స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

