కలం, వెబ్ డెస్క్: మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. త్వరలో డిజిటల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వెల్లడించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒక సరికొత్త డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్లాట్ఫ్లామ్ ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా, పూర్తి నిష్పక్షపాతంగా ఉంటూ సత్యానికే కట్టుబడి పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సామాన్య ప్రజలు మహిళలు, యువత, రైతులు, కార్మికుల గొంతుకగా మారి, వారి సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
డిజిటల్ వేదిక విజయవంతంగా ప్రారంభమైన తర్వాత, అదే విలువలు, ఆశయాలతో ఒక తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ను కూడా ప్రారంభించే ఆలోచన ఉన్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ మీడియా సంస్థకు సంబంధించిన పేరును త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. అప్పటి వరకు అందరూ వేచి ఉండాలని కోరారు. స్వతంత్రంగా ఉంటూ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేసేందుకే ఈ నూతన ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు.

