కలం, వెబ్ డెస్క్ : కోయంబత్తూరులో జరిగిన ఐజీయూ సదర్న్ ఇండియా జూనియర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్లో హర్యానా యువ గోల్ఫర్ విహాన్ జైన్ (Vihaan Jain).. అదిరిపోయే ప్రదర్శన కనబరిచాడు. చివరి రౌండ్లో తీవ్ర ఒత్తిడి ఎదురైనా.. అద్భుత పుట్టింగ్తో టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్ డేకు ముందు నాలుగు షాట్ల ఆధిక్యంలో ఉన్న విహాన్.. ఆరంభంలో తడబడ్డాడు. తొలి తొమ్మిది హోల్స్లో నాలుగు బోగీలు రావడంతో తమిళనాడు ఆటగాడు నీలొఫర్ శివమూర్తి గట్టిగా పోటీలోకి వచ్చాడు. 10వ హోల్ వద్ద ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి.
ఇక అక్కడి నుంచే మ్యాచ్ అసలు మలుపు తిరిగింది. 10వ హోల్లో విహాన్ షాట్ స్ప్రింక్లర్కు తాకి అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్లినా.. కూల్గా తిరిగి నిలబడ్డాడు. తర్వాత పుట్టర్తో మ్యాజిక్ చేశాడు. 14వ హోల్లో 22 అడుగుల పట్, 15వ హోల్లో 15 అడుగుల పట్, 16వ హోల్లో 10 అడుగుల పట్, 17వ హోల్లో 12 అడుగుల పట్ కొట్టి ఒత్తిడిని పూర్తిగా ప్రత్యర్థిపైకి నెట్టేశాడు. ఆ ప్రెషర్ను తట్టుకోలేక నిలొఫర్ 16, 17 హోల్స్లో బోగీలు చేశాడు. దీంతో విహాన్కు కీలక ఆధిక్యం దక్కింది. చివరి హోల్లో ప్రశాంతంగా పార్ పూర్తి చేసి టైటిల్ ఖాయం చేసుకున్నాడు.
16 ఏళ్ల విహాన్కు ఇది వరుసగా రెండో క్యాటగిరీ-ఏ టైటిల్. గత వారం వైజాగ్లో గెలిచిన అతను.. ఇప్పుడు కోయంబత్తూరులోనూ అదే జోరు కొనసాగించాడు. మొత్తం 300 స్కోర్తో ఛాంపియన్గా నిలిచాడు. ఇక క్యాటగిరీ-బీ విభాగంలో ఢిల్లీకి చెందిన చైతన్య పాండే మరోసారి సత్తా చాటాడు. చివరి రౌండ్లో 77 స్కోర్ చేసి వరుసగా రెండో టైటిల్ను అందుకున్నాడు.

