కలం, నల్లగొండ బ్యూరో: కార్మికుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) స్పష్టం చేశారు. హైదరాబాద్ సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముగిసిన ఆర్టీసీ సమ్మెపై మాట్లాడారు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. మూడు రోజుల పాటు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను సమగ్రంగా తెలుసుకుని పరిష్కార మార్గాలను అన్వేషించామని, కార్మికుల పక్షాన ప్రభుత్వం అండగా నిలిచిందని పేర్కొన్నారు.
సమ్మె సమయంలో ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడటం ఎంతో బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినవేనని, వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కార్మికుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రిమోటు సర్వీసుల్లో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్న సుమారు 300 మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, ఆర్థిక వ్యవస్థను సమతుల్యం చేస్తూ కార్మికుల హక్కులను కాపాడుతున్నామని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడం, వారి కుటుంబాలకు భరోసా కల్పించడం, వారి హక్కులను రక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని (Vemula Veeresham) తెలిపారు.
Read Also: మంత్రి Vs ఎమ్మెల్యే.. వివేక్ నర్సాపూర్ పర్యటనలో రచ్చ
Follow Us On : WhatsApp

