కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా నర్సాపూర్ (Narsapur)లో మంత్రి వివేక్ (Vivek) పర్యటన రచ్చ రచ్చగా మారింది. శనివారం నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు, అంగన్వాడీలో చదువుకునే పిల్లలకు మంత్రి వివేక్ వెంకట స్వామి యూనిఫార్మ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి (MLA Sunita), గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఎప్పుడు పంపిణీ చేస్తారని మంత్రిని ప్రశ్నించారు.
దానికి మంత్రి వివేక్.. కేసీఆర్ వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని బదులిచ్చారు. అంతే కాకుండా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కూడా గత ప్రభుత్వం, కేసీఆర్ చేసిన నిర్వాకమే కారణమని చెప్పడంతో వివాదం రాజుకుంది. మంత్రి వివేక్ ప్రసంగాన్ని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి (Vivek – MLA Sunita) అడ్డుకొని, కౌంటర్ వేసే ప్రయత్నం చేశారు. మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం పెరుగుతుండటంతో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కల్పించుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, వాళ్లిద్దరూ వినకపోవడంతో సభలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో మీటింగ్ హాల్ మొత్తం ఇరుపార్టీల కార్యకర్తల నినాదాలతో రసాభాసగా మారింది. నాయకులను కంట్రోల్ చేయలేక పోలీసులు తంటాలు పడ్డారు.
Read Also: కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: వేముల వీరేశం
Follow Us On: Instagram

