కలం, మహబూబ్నగర్ బ్యూరో: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి మంగళవారం (ఆగస్టు 25)న జిల్లావ్యాప్తంగా భారీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) అధికారులను ఆదేశించారు. సోమవారం మహబూబ్ నగర్ (Mahabubnagar) కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లాలో సామూహికంగా మొక్కలు నాటే వన మహోత్సవం (Vanamahotsavam) కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో మొక్కలు నాటే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. మండల, నియోజకవర్గ స్థాయిలోనూ విస్తృతంగా మొక్కలు నాటాలని, ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను కార్యక్రమాలకు ఆహ్వానించాలని తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర అన్ని శాఖలు తమ పరిధిలో క్షేత్రస్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
కార్యక్రమాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో ప్రతి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వివరాలను జిల్లా స్థాయికి అందించాలని సూచించారు. కార్యక్రమాల నిర్వహణలో ఎలాంటి సమన్వయ లోపాలు లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, జెడ్పీసీఈఓ ఇన్చార్జి, డీపీఓ వెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

