కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని అమ్రోహా జిల్లా హసన్పూర్లో ఓ వివాహ వేడుకలో వింత సంఘటన జరిగింది. ముస్లిం పెళ్లి వేడుకలో వడ్డించిన బిర్యానీలో తగినన్ని చికెన్ లెగ్ పీస్లు లేవని వరుడు తరపు బంధువులు నానా రభస చేశారు. అంతేకాదు ఆగ్రహంతో ఊగిపోతూ మండపంలోని కుర్చీలను విరగొట్టారు. ఈ క్రమంలోనే భోజనశాలను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)గా మారింది.
హసన్పూర్కు చెందిన ఒక యువతికి, సమీప ప్రాంతానికి చెందిన యువకుడికి వివాహం నిశ్చయం కాగా.. పెళ్లి వేడుకకు హాజరైన వరుడి తరుఫు బంధువులకు విందు ఏర్పాటు చేసిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భోజనాల సమయంలో వడ్డించిన బిర్యానీలో తమకు తగినన్ని చికెన్ లెగ్ పీస్లు రాలేదంటూ వరుడి తరుఫు వారు వడ్డించే వారితో తొలుత వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదం చూస్తుండగానే ఇరు వర్గాల మధ్య పెద్ద ఘర్షణకు దారి తీసింది. కోపంతో ఊగిపోయిన ఇరు పక్షాల వారు భోజనశాలలోని కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గొడవను అక్కడున్న వారు ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వీడియో ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

