కలం, వెబ్ డెస్క్ : వరంగల్ (Warangal) జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ పరిధిలో ఓ వివాహిత తన కొడుకుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. కళ్యాణి (24) అనే మహిళ, తన మూడేళ్ల కుమారుడు శ్రేయాన్ష్ (3)ను చున్నీతో తనకు కట్టుకుని ఎస్సారెస్పీ కాలువ (SRSP Canal) లోకి దూకింది. కాలువలో నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో తల్లి-కొడుకు ఇద్దరూ కొట్టుకుపోయారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. కాలువ ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి, చివరకు ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పరిశీలించగా.. కళ్యాణి పెదవులను చేపలు పూర్తిగా తినేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా వరకట్న వేధింపులే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

