కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో మరో రెండు ఎయిర్పోర్టుల నిర్మాణానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో ఉడాన్ 2.0 పథకం కింద కొత్త విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఉన్న ఎయిర్స్ట్రిప్లను ఎయిర్పోర్టులుగా మార్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఆదిలాబాద్లో ఎయిర్ఫోర్స్ ఎయిర్స్ట్రిప్ను స్వాధీనం చేసుకోబోమని, మిగిలిన భూమిని సేకరించి ఎయిర్పోర్టు నిర్మిస్తామని స్పష్టం చేశారు. బేగంపేట ఎయిర్పోర్టు రన్వే కింద ట్రాఫిక్ టన్నెల్కు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని, ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే అనుమతులు ఇస్తామని తెలిపారు.
ఇప్పటికే వరంగల్ మామునూర్, కొత్తగూడెం ఎయిర్పోర్టుల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, మామునూర్ ఫైల్ అంతర్ మంత్రిత్వ శాఖల దశలో ఉందని చెప్పారు. జూన్లో శంకుస్థాపనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొత్తగూడెం, బసంత్నగర్ ఎయిర్పోర్టుల కోసం రాష్ట్రం చూపిన స్థలాలు అనుకూలంగా లేవని, కొత్త ప్రదేశాలు సూచించనున్నట్లు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) తెలిపారు.
ఉడాన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు, హెలిపోర్టుల అభివృద్ధికి భారీ నిధులు కేటాయించినట్లు చెప్పారు. అలాగే ఏపీలో భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్టులను జూన్ నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.

