కలం, వెబ్ డెస్క్ : ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కారణంగా నేటి నుండి ఉప్పల్ రింగ్ రోడ్డు (Uppal Ring Road)ను మూసివేస్తున్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు రాబోయే మూడు నెలల పాటు అమలులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఎంఎంసీ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం ట్రాఫిక్ మళ్లింపుల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
రామంతాపూర్ లేదా హబ్సిగూడ వైపు నుండి వరంగల్ వెళ్లే వాహనాలు పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక భాగం నుండి బీరప్పగడ్డ మీదుగా వరంగల్ జాతీయ రహదారికి చేరుకోవాలి.
నాగోల్, ఎల్బీనగర్ వైపు నుండి వరంగల్ వెళ్లే వాహనదారులు హయాత్నగర్ మీదుగా పెద్ద అంబర్పేట్ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పైనుండి ప్రయాణించవచ్చు. లేదా సర్వీస్ రోడ్డు మార్గాన ఘట్కేసర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిని చేరుకోవాల్సి ఉంటుంది.
పీర్జాదిగూడ వైపు నుండి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఉప్పల్ జంక్షన్ (Uppal Ring Road) రాకముందే ఉన్న లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా వెళ్ళాలి. అక్కడ నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద గల మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ చేరుకొని, యూ టర్న్ తీసుకుని సికింద్రాబాద్ వైపు ప్రయాణించాల్సి ఉంటుంది.
పీర్జాదిగూడ నుండి నాగోల్ వెళ్లాలనుకునే వారు ఉప్పల్ భగాయత్ లేఔట్ ద్వారా వెళ్ళాలి. నాగోల్ నుండి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు సైతం ఇదే భగాయత్ మార్గం మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది.
ఈ ఆంక్షల నుండి హుబ్సిగూడ నుండి నాగోల్ వైపు వెళ్లే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులకు ఎలాంటి ఆంక్షలు లేవని ఎంఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. వాహనదారులు ఈ మార్పులను గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించవలసిందిగా కోరారు.
Read Also: బండి భగీరథ్ కేసులో ట్విస్ట్.. అనుచిత పోస్టులపై కేసు నమోదు!
Follow Us On: Instagram

