కలం వెబ్ డెస్క్ : హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy )కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) బహిరంగ లేఖ రాశారు. ఎల్ అండ్ టీ సంస్థ నుంచి నెట్వర్క్ను స్వాధీనం చేసుకొని రెండోదశ పనులపై ముందుకు సాగాలని కోరారు. నగరంలో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రెండో దశ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరినట్లు తెలిపారు. ఇప్పటికే అమలు జరుగుతున్న మొదటి దశ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వమే నిర్వహిస్తుందని ప్రకటించిందని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను కలిసి మెట్రో రెండో దశ నిర్మాణం గురించి చర్చించినట్లు చెప్పారు. ముందుగా మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని, అందుకు అన్ని ఒప్పందాలు, నిర్ణయాలు, లావాదేవీలు పూర్తి కావాలని ఆయన అన్నారని చెప్పారు. లావాదేవీలు పూర్తయిన తర్వాత రెండో దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి అంగీకరించిందని మనోహర్లాల్ ఖట్టర్ గుర్తు చేశారన్నారు.
మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ నుంచి తీసుకోవడం, రెండో దశకు సన్నాహాల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేయడంపై సీఎంతో కలిసి నిర్ణయించారని కూడా మనోహర్ లాల్ ఖట్టర్ తనకు తెలిపినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారన్నారు. ఇందుకోసం రాష్ట ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారుల పేర్లను పంపాలని కోరినట్లు కూడా వివరించారన్నారు. కానీ, ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లను ప్రతిపాదించలేదని వెల్లడించారు. కావున సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఇద్దరు అధికారుల పేర్లు పంపి సమావేశ నిర్వహణకు ప్రయత్నం చేయాలని కోరారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రో నెట్ వర్క్ను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా స్వాధీనం చేసుకొని మెట్రో రెండో దశ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపి, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు.


