కలం, వెబ్డెస్క్: వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాము పడగ కింద ఉన్నారని, ఇప్పటికైనా జాగ్రత్త పడాలని మంత్రి సవిత (Minister Savitha) హెచ్చరించారు. వైసీపీ అంటేనే క్రిమినల్ పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ నాయకులు చేస్తున్న దీక్షలు, ఇటీవల వైఎస్ జగన్ పర్యటనపై సవిత మీడియాతో మాట్లాడారు.
జగన్ సొంత రాజకీయాల కోసం, అధికారం కోసం సొంత పార్టీ వాళ్లను కూడా బలి తీసుకుంటున్నారని విమర్శించారు. జగన్, అతడి రౌడీ బ్యాచ్ ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో నా బడుగు బలహీన వర్గాలంటూ మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పూర్తిగా పక్కనపెట్టారన్నారు. నాడు ఎన్టీఆర్, నేడు లోకేశ్ మాత్రమే అట్టడుగు వర్గాల వారికి మేలు చేశారని మంత్రి సవిత స్పష్టం చేశారు.

