కలం, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ కమర్షియల్, డొమెస్టిక్ ఎల్పీజీ వినియోగదారులకే షాక్ ఇవ్వగా తాజాగా ‘ఉజ్వల’ మహిళలకు కూడా ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటివరకూ ప్రతి ఏటా తొమ్మిది సిలిండర్లకు ఒక్కోదానిపై రూ. 300 చొప్పున ఇస్తుండగా ఇక నుంచి నాలుగు సిలిండర్లకు మాత్రమే ఇస్తామని పేర్కొన్నది. ఇంటర్ మినిస్టర్ గ్రూపు సమావేశంలో పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖన్నూజా ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన చమురు ధరలు, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
నాలుగు సిలిండర్లకు మాత్రమే..
వాస్తవానికి ఒక్కో ఎల్పీజీ సిలిండర్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్ రేటు ప్రకారం రూ. 1600 దాటిందని, కానీ పరోక్ష సబ్సిడీతో డొమెస్టిక్ వినియోగదారులకు రూ. 962కే ఇస్తున్నామని, ‘ఉజ్వల’ మహిళలకు అదనంగా రూ. 300 సబ్సిడీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఆ ప్రకారం వారికి రూ. 692కే సిలిండర్ అందుతున్నదని, ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో వారికి దాదాపు వెయ్యి రూపాయల సబ్సిడీ ఇస్తున్నట్లు అయిందన్నారు. ఇకపైన మొత్తం తొమ్మిది సిలిండర్లకు ఆ సబ్సిడీ (LPG Subsidy)ని ఇవ్వలేదని, నాలుగు సిలిండర్లకు మాత్రమే రూ. 300 చొప్పున సంవత్సరానికి రూ. 1200 ఇవ్వగలమని ఖన్నూజా వివరించారు.
రూ. 1200 చొప్పున సబ్సిడీ..
ఎల్పీజీ దిగుమతులకు ప్రామాణిక సూచికగా పరిగణించే సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్ ఫిబ్రవరిలో టన్నుకు 543 డాలర్లుగా ఉండగా, హోర్ముజ్ జలసంధి మూసివేత అనంతరం ఏప్రిల్లో అది 775 డాలర్లకు చేరిందని పేర్కొన్నారు. జూన్ నాటికి ఈ ధర టన్నుకు సుమారు 790 డాలర్లకు పెరిగిందని, ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ ఎల్పీజీ ధరలు దాదాపు 46% తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10.58 కోట్లకు పైగా ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయని, ప్రత్యక్ష సబ్సిడీ విధానం ద్వారా ఈ కుటుంబాలకు సంవత్సరానికి రూ. 1200 చొప్పున సబ్సిడీ కొనసాగుతున్నదన్నారు.

