కలం, వెబ్ డెస్క్: ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారిన శ్రీశైలం (Srisailam) గర్భాలయ వీడియో ఘటనపై ఆలయ ఈవో చర్యలకు ఉపక్రమించారు. విధుల్లో అలసత్వం వహించిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇటీవల ఉగాది ఉత్సవాల సమయంలో ఓ వ్యక్తి గర్భాలయంలో వీడియో తీశాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసుకున్నాడు. దీంతో వీడియో వైరల్గా మారింది. సాధారణంగా గర్భాలయంలోకి మొబైల్ ఫోన్లు అనుమతించరు, అలాంటిది ఇలా వీడియో తీసి వైరల్ చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఈవో విచారణ చేపట్టి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ సూపర్వైజర్తో పాటు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వీడియో తీసిన కర్ణాటకకు చెందిన భక్తుడిపై కేసు నమోదు చేశారు. ఆలయ సీఎస్వోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

