కలం, వెబ్ డెస్క్ : సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాకుండా ప్రజాప్రతినిధులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా పోలవరం ఎమ్మెల్యే (Polavaram MLA) చిర్రి బాలరాజు (Chirri Balaraju) సైబర్ వలలో చిక్కుకుని భారీ మొత్తంలో నగదు కోల్పోయారు. ఆర్టీఏ (RTA) చలానా చెల్లించాలంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఒక యాప్ లింక్ను ఎమ్మెల్యే క్లిక్ చేయడంతో ఈ మోసం జరిగింది. ఆ లింక్ ద్వారా ఆయన ఫోన్ హ్యాక్ చేసిన కేటుగాళ్లు, ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా రూ.12 లక్షలను కాజేశారు.
ఖాతాలో నగదు మాయమైన విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, ప్రజలు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను లేదా అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రభుత్వ విభాగాల పేరుతో వచ్చే యాప్ లింక్ల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

