కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ విజ్ఞప్తి మేరకు ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు భారత జాతీయ కాంగ్రెస్ (Congress) తన పూర్తి మద్దతును ప్రకటించింది. తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా యువత లౌకిక, ప్రగతిశీల, సంక్షేమ ప్రభుత్వం కావాలని స్పష్టమైన తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ వెల్లడించారు. భారత రాజ్యాంగ సూత్రాలను గౌరవించే పార్టీగా ప్రజల తీర్పును గౌరవించడం తమ బాధ్యత అని కాంగ్రెస్ పేర్కొంది. అయితే ఈ కూటమిలో రాజ్యాంగ వ్యతిరేక లేదా మతతత్వ శక్తులకు చోటు ఉండకూడదనే షరతును విధించింది.
పెరుంతలైవర్ కామరాజ్ పాలన నాటి స్వర్ణ యుగాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కూటమి పని చేయనుంది. తంతై పెరియార్ సామాజిక న్యాయం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ ఆశయాలకు కట్టుబడి ప్రజా రంజక పాలన అందిస్తామని ఉభయ పార్టీలు (TVK – Congress) ప్రకటించాయి. ఈ పొత్తు కేవలం ప్రభుత్వం ఏర్పాటుకే పరిమితం కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్సభ, రాజ్యసభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, బాధ్యతల భాగస్వామ్యంతో కూడిన ఈ చారిత్రాత్మక ఒప్పందంపై విజయ్, రాహుల్ గాంధీ సంయుక్తంగా తమ నిబద్ధతను చాటారు. తమిళనాడు యువత కలలు, వాగ్దానాలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు.
Read Also: ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టులో పిటిషన్
Follow Us On : WhatsApp

