కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో టీవీకే (తమిళ వెట్రి కజగం) అనూహ్య విజయాల దిశగా దూసుకుపోతోంది. మొత్తం 234 స్థానాలకు గానూ ప్రస్తుతం 110 స్థానాల్లో ఈ పార్టీ ఆధిక్యంలో ఉండటంతో విజయ్ (TVK Chief Vijay) అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ చారిత్రాత్మక సందర్భంపై విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ (SA Chandrasekhar) స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమిళ ప్రజల కోసం, సమాజం కోసం ఏదో ఒకటి చేయాలనే సంకల్పం విజయ్ మనసులో గత 30 ఏళ్లుగా బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ ఆలోచన క్రమంగా పరిణతి చెంది, నేడు ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం వరకు తీసుకువచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. విజయ్ కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, ప్రతి ఇంట్లో ఒక సభ్యుడిగా మారిపోయారని ఆయన కొనియాడారు.
తమిళనాడులోని మహిళలు ఆయన్ని తమ సొంత కొడుకులా భావిస్తారని, యువత తమ అన్నయ్యగా గౌరవిస్తారని చంద్రశేఖర్ తెలిపారు. వృద్ధులు సైతం విజయ్ని (TVK Chief Vijay) తమ మనవడిగా చూసుకుంటున్నారని, ప్రజలతో ఆయన పెంచుకున్న ఈ ఆత్మీయ బంధమే నేడు ఈ స్థాయికి చేర్చిందని ఆయన ఉద్ఘాటించారు. రాజకీయాల్లో సరికొత్త మార్పు దిశగా విజయ్ అడుగులు పడుతున్న వేళ, ఈ ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
Read Also: మమతా నివాసం వద్ద ఉద్రిక్తత: జై శ్రీరామ్ నినాదాలు..!
Follow Us On: Sharechat

