కలం, వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సమాచారం అందించింది. జూన్ 10 వ తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కేటాయింపులో సరికొత్త మార్పులు తీసుకురానుంది. తిరుమలలో వేచి ఉండే దాతల కోసం ప్రతిరోజూ 300 టికెట్లను కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రత్యేక కోటాను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు మధ్యాహ్నం 1 గంట లోపు ఈ టికెట్లను బుక్ చేసుకుంటే, అదే రోజు స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు కలియుగ వైకుంఠంలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 78,389 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 45,283 మంది మొక్కులు చెల్లించి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లుగా నమోదైంది.

