కలం, వెబ్ డెస్క్: టీటీడీ (TTD) పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 82 అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని ఆళ్వార్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు శౌచాలయాల నిర్మాణానికి రూ.4.54 కోట్ల నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు. అలాగే శ్రీవారి ఆలయ మాడ వీధులు, రహదారులు, కూడళ్లకు 51 మంది భక్తుల పేర్లు పెట్టేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. అమరావతిలోని శ్రీవారి ఆలయంలో నూతన మండపాల నిర్మాణానికి రూ.36.9 కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు.
పైప్ లైన్ పనులకు 6 కోట్లు
గోగర్భం డ్యామ్ నుంచి ఫిల్టర్ హౌస్ వరకు పైపు లైన్ పనులకు రూ.6 కోట్ల నిధులు కేటాయించనున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కో-ఆప్టెక్స్ సంస్థల నుంచి రూ.44.2 కోట్ల విలువైన పట్టు వస్త్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇంకా తమిళనాడులోని కోయంబత్తూరు జీ-స్క్వేర్ సంస్థ తితిదే పేరుతో రిజిస్టర్ చేసిన 19.49 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాలకమండలి సభ్యులు ఆమోదం తెలిపారు.

